సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్రం చర్యల పట్ల విజయశాంతి స్పందన

  • ఓటీటీ, డిజిటల్ కంటెంట్ నియంత్రణకు నియమ నిబంధనలు
  • కేంద్రం మార్గదర్శకాలు
  • కేంద్రం చర్యలను స్వాగతించిన విజయశాంతి
  • విద్వేషాన్ని రగిల్చే రాతలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యలు
ఓటీటీ, డిజిటల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్రం నియమ నిబంధనలు ప్రకటించడం పట్ల తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సరైన విధివిధానాలు లేకుండా ఉన్న ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవడం హర్షణీయం అని పేర్కొన్నారు.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట విద్వేషాన్ని రగిల్చే రాతలు, వీడియోలు ఎక్కువయ్యాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటి రాతల కారణంగా అనేక కుటుంబాలు మనోవేదనకు గురయ్యే పరిస్థితి నెలకొందని వివరించారు.

ఓటీటీలు, సోషల్ మీడియాకు ఇప్పటివరకు నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వ్యవస్థల ఉనికే ప్రమాదంలో పడిందని, దేశ ఐక్యత సైతం ముప్పు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని విజయశాంతి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్న విషయాన్ని తాను గతంలో ప్రస్తావించానని విజయశాంతి వెల్లడించారు. అన్ని సమస్యలకు పరిష్కారంగా కేంద్రం నియంత్రణ చర్యలకు సిద్ధం కావడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

Vijayashanti
OTT
Digital Media
Measures
Union Government

More Telugu News